ఐటీ ఈ-ఫైలింగ్ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు గడువు పెంపు?

మంగళవారం, 14 జులై 2020 (11:04 IST)
కరోనా వైరస్ దెబ్బకు విద్యా సంవత్సరంతోపాటు... ఆర్థిక సంవత్సరం కూడా దెబ్బతింది. 2020 మార్చి 31వ తేదీతో ముగియాల్సిన అనేక గడువులను కేంద్రం ప్రభుత్వంతో పాటు.. భారత రిజర్వు బ్యాంకు పొడగించింది. తాజాగా ఐటీ ఈ-ఫైలింగ్ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు కూడా గడువు పెంచారు. 
 
ఈ క్రమంలో 2015-2016 మదింపు సంవత్సరం నుంచి 2019-2010 మదింపు సంవత్సరం వరకు ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌ల వెరిఫికేషన్ల‌కు ఈ యేడాది సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్‌ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను వెరిఫికేషన్‌ చేసుకోని వారికి ఐటీ శాఖ ఈ అవకాశం ఇచ్చింది. అయితే, కరోనా వైరస్ కారణంగా గత ఫిబ్రవరి నుంచి అనేక మంది తమ ఇళ్లనుంచి బయటకు రావడంలేదు. పైగా, లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆఫీసులు కూడా మూసివేయడం జరిగింది. 
 
దీంతో బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌లు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సకాలంలో ఐటీఆర్‌-వీలను సమర్పించాలని, లేదంటే ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.
 
పన్ను చెల్లింపుదారులు డిజిటల్‌ సంతకం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆధార్‌ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే నెట్‌ బ్యాంకింగ్ ద్వారా,‌ బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్‌-వీ పత్రాలను పంపడం ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 
 
టీఆర్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌లో జాప్యం నెలకొనడంతో అధికారులు  ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ధ్రువీకరణ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు