కేన్సర్ పేషెంట్లకు కరోనాతో ముప్పు.. రెమ్‌డిసివిర్‌ వినియోగంపై చర్చ

శనివారం, 17 అక్టోబరు 2020 (12:45 IST)
కరోనాతో అతి పెద్ద ముప్పు పొంచివుంది. కేన్సర్ రోగులకే కరోనాతో అతి పెద్ద ముప్పు అని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో నిర్వహించిన సర్వేలో ఇతర కరోనా రోగులతో పోలిస్తే… కరోనా బారిన పడిన క్యాన్సర్ రోగులు ఆసుపత్రిలో ఎక్కువగా చేరే అవకాశం ఉందని.. తాజా అధ్యయనంలో గుర్తించారు. రాయిటర్స్‌లో దీనికి సంబంధించి ఒక నివేదిక ప్రచురించారు. ఈ అధ్యయనం అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్ జర్నల్‌‌లో తొలుత ప్రచురించబడింది.
 
ఈ అధ్యయనంలో మొత్తం 23,000 మంది క్యాన్సర్ రోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యుఎస్ వెటరన్స్ అఫైర్స్ ఆరోగ్య కేంద్రాల్లో వీరిని పరీక్షించారు. 23,000 మందిలో, సుమారు 1,800 (7.8 శాతం) మంది కరోనా బారిన పడ్డారు. వయసు ప్రభావం ఏమీ లేకుండానే కరోనా బారిన పడ్డారు. కోవిడ్ -19 ఉన్న క్యాన్సర్ రోగులలో మరణాల రేటు 14 శాతం ఉందని ఈ అధ్యయనంలో తేలింది.
 
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌.. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితుల విషయంలో పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డిసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది.
 
దేశంలో కొవిడ్‌-19 బాధితులకు రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, రిటోనావిర్‌ (లోపినావిర్‌), ఇంటర్‌ఫెరాన్‌ అనే ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిలో హైడ్రాక్సీ ఔషధాన్ని కొవిడ్‌ ప్రారంభ దశలో, రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. దేశంలో కొవిడ్ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్‌డెసివిర్‌ కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు