కోవిషీల్డ్ టీకా ధర రూ.250 మాత్రమే...

మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:17 IST)
సీరన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్ కట్టడి కోసం కోవిషీల్డ్ పేరుతో ఓ టీకా చేసింది. టీకాల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న ఈ సంస్థ ఉత్పత్తి సామార్థ్యంపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారు కూడా. అందుకే.. అధిక జనాభా కలిగిన భారత్ అవసరాలు తీర్చేందుకు సీరం అనువైనది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దీంతో, దేశ అవసరాలకు సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం‌ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాను కేవలం రూ.250కే అందిస్తామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 
 
ఆక్సఫర్డ్ టీకా ధర రూ.వెయ్యి వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే, టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే.. సీరం మాత్రం ఇప్పటివరకూ ఈ వార్తలపై స్పందించలేదు. టీకా పంపిణీ విషయంలో తొలి ప్రాధాన్యం భారత్‌కే అని సీరం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ సీరం ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. కరోనా టీకాను ప్రజల కోసం వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు బ్రిటన్ టీకా పంపిణీకి సిద్ధమవుతుండటం.. మరోవైపు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోవడంతో కేంద్రం ఈ దిశగా వడవడిగా అడుగులు వేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు