హిమాచల్ ప్రదేశ్: తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా..!

మంగళవారం, 2 మార్చి 2021 (21:59 IST)
కరోనా మహమ్మారి దేశంలో తగ్గినా.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తూనే వుంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా తాకిడి పెరుగుతూనే వుంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ధర్మశాల సమీపంలోని సిద్బరి గైటో తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
ఫిబ్రవరి 23న జిల్లాలో పలు కేసులు వెలుగుచూడగా, తాజాగా సిద్బరి మఠానికి చెందిన సన్యాసుల్లో 154 కొవిడ్‌-19 కేసులు బయటపడ్డాయని కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ గుర్‌దర్శన్‌ గుప్తా పేర్కొన్నారు. వీరిలో ఒక సన్యాసి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
 
కరోనా పాజిటివ్‌గా తేలిన మిగిలిన వారిని మఠంలోనే క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ మఠం పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామని, ఈ ప్రాంతంలోకి ఏ ఒక్కరినీ అనుమతించడం లేదని వెల్లడించారు. 
 
కరోనా వైరస్‌ సోకిన సన్యాసుల్లో పలువురు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కర్ణాటక, ఢిల్లీలో ప్రయాణించారని డాక్టర్‌ గుప్తా తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన సన్యాసుల్లో అత్యధికులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు