సీజనల్ వ్యాధిగా మారిన కరోనా.. తెలంగాణాలో మరింతగా వ్యాప్తి

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (09:18 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు సీజనల్ వ్యాధిగా మారిపోనుందట. హెర్డ్ ఇమ్యూనిటీ (సామాజిక రోగ నిరోధకత) ఎంత త్వరగా సాధిస్తే అంత త్వరగా అది సీజనల్ వ్యాధిగా మారుతుందని లెబనాన్‌లోని బీరూట్ అమెరికన్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో పేర్కొంది. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ప్రతీ సీజన్‌లోనూ ఇది పలుమార్లు వస్తూనే ఉంటుందని అధ్యయనం వివరించింది.
 
శ్వాసకోశ సంబంధ వైరస్‌లు సీజన్ల వారీగా ఎలా విజృంభిస్తున్నాయి? భవిష్యత్తులో ఈ వైరస్ ఎలా పరిణమించబోతోందన్న అంశంపై శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 
 
హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే కరోనా వ్యాప్తి దానంతట అదే తగ్గిపోతుందని, తర్వాత సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే వైరస్ కనిపిస్తుందని అధ్యయనకర్త హసన్ జారేకేత్ తెలిపారు. 
 
ప్రజలు కూడా కరోనాకు అలవాటు పడాలని, కరోనాను దూరంగా ఉంచేందుకు ఇప్పటిలానే మాస్కులు ధరించడం, చేతులను నిత్యం శుభ్రం చేసుకోవడం మాత్రం తప్పనిసరని హసన్ పేర్కొన్నారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. తాజగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2273 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,62,844కు చేరింది. కొత్తగా 2260 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,31,447 మంది ఇండ్లకు చేరుకున్నారు. 
 
తాజాగా మరో 12 మంది మృతి చెందగా, మొత్తం 996 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.61శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 80.71శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.52శాతం) కంటే ఎక్కువని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు