పెళ్లైన రెండు రోజులకే.. నవవధువుకు కరోనా.. పెళ్లికొచ్చిన వారికి చుక్కలు..

శుక్రవారం, 22 మే 2020 (14:41 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే ఓ నవవధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో కొత్త జంట షాక్ తింది. వారి పెళ్లికి హాజరైన 30 మంది కుటుంబాల్లో కలవరం మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా సత్లాపూర్ గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. సుదీర్ఘ లాక్‌డౌన్ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులతో పెళ్లి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా సత్లాపుర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో భోపాల్‌లోని జట్ కేడికి చెందిన యువతితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. సోమవారం 30 మందితో కలిసి వారి పెళ్లి నిరాడంబరంగా జరిపించారు. పెళ్లయిన రెండో రోజే వధువులో కాస్త అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నవవధువుకు కరోనా పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. 
 
పెళ్లికి వారం ముందే జ్వరంతో బాధపడిన ఆ యువతి మాత్రలు వేసుకోవటంతో కాస్త తగ్గింది. అయినప్పటికీ శనివారం ఆమెకు తల్లిదండ్రులు కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత సోమవారం కొద్ది మంది సమక్షంలో యువతికి పెళ్లి జరింపించారు. కానీ పెళ్లైన రెండు రోజులకే బుధవారం నాటికి యువతికి కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. అటు వరుడు, ఇటు వధువు కుటుంబాల్లోనే కాకుండా పెళ్లికి వెళ్లిన ముఫ్పై కుటుంబాల్లో కూడా ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్యశాఖ సిబ్బంది పెళ్లికొడుకుతో సహా పెళ్లికి హాజరైన వారందరినీ గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాకుండా ఆ ముఫ్పై మందితో కాంటాక్టులో ఉన్న వారిని కూడా ట్రేస్ చేసే పనిలో సిబ్బంది ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు