తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ : దేశ వ్యాప్తంగా 17 లక్షలు క్రాస్

ఆదివారం, 2 ఆగస్టు 2020 (11:26 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేంగా వ్యాపిస్తోంది. దీంతో ఆదివారం కొత్తగా మరో 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఆసుపత్రుల్లో 18,547 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 47,590  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 540కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 517 మందికి కొత్తగా కరోనా సోకింది. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 71.3 శాతం, మ‌ర‌ణాల రేటు 0.80 శాతంగా ఉన్న‌ది. 
 
ఇదిలావుంటే, కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 517 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చ‌ల్ జిల్లా‌లో 146, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 138 కేసుల చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ ఆస్పత్రుల్లో 18547 మంది చికిత్స తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 కేసులు, మరణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 54,736 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 853 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 17,50,724కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 37,364కి పెరిగింది. 5,67,730 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,45,630 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 1,98,21,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,63,172 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు