ఏడేళ్ళ బాలుడికి కరోనా... తెలంగాణాలో భయపెడుతున్న వైరస్

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలతో పాటు... అధికార యంత్రాంగాన్ని భయపెడుతుంది. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మరోవైపు, తెలంగాణాలో ఏడేళ్ళ బాలుడికి కరోనా వైరస్ సోకింది. 
 
గత నెల 17వ తేదీన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి (36) స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గృహంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికి పంపించారు. 
 
అయితే, ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా ఈ నెల 12న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణా రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే ఏకంగా 61 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. గత వారం ఒక్క రోజే 75 కేసులు వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఈ తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 592కు పెరిగింది. 
 
వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసులే 267 ఉండడం గమనార్హం. అలాగే, రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 103 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఐదు జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ విస్తరించింది. మరోవైపు వైరస్ తీవ్రంగా ఉన్న 246 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. 6,41,194 ఇళ్లలో ఇంటింటి సర్వే చేపట్టి 27,32,644 మందిని పరీక్షించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు