కరోనా వైరస్ రెండో దశవ్యాప్తి అనివార్యం.. కానీ....

గురువారం, 21 మే 2020 (10:04 IST)
కరోనా వైరస్... చైనాలోని వుహాన్‌లో పురుడు పోసుకున్న ఈ వైరస్... ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 215కు పైగా దేశాలకు వైరస్ సోకింది. ఫలితంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం గజగజ వణికిపోతున్నాయి. అంతేనా.. ఈ వైరస్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పైగా, ఈ వైరస్ వెలుగులోకి వచ్చి అపుడే ఆర్నెల్లు దాటిపోయింది. కానీ, ఈ వైరస్ ఉధృతి మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. 
 
ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఐరోపా, భారత్ వంటి దేశాలను బెంబేలెత్తిస్తోంది. టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐరోపా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (ఈసీడీసీ) డైరెక్టర్ ఆండ్రియా అమ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 
 
కరోనా రెండో దశ వ్యాప్తి అనివార్యమని, అయితే అది ఎప్పుడు మొదలవుతుంది? దాని తీవ్రత ఎంత అనేది మాత్రం తేలాల్సి ఉందన్నారు. కరోనా వైరస్ ఉద్ధృతి కొంత నెమ్మదించిన నేపథ్యంలో పలు దేశాలు లాక్డౌన్‌ను సడలిస్తున్నాయి. సౌత్ కొరియాలో బుధవారం నుంచి స్కూల్స్ కూడా ప్రారంభమయ్యాయి. 
 
ఫ్రాన్స్‌లో పాఠశాలలు తెరిచినప్పటికీ అది వారం రోజుల ముచ్చటే అయింది. పాఠశాలలతో సంబంధం ఉన్న కరోనా కేసులు వెలుగుచూడడంతో స్కూళ్లను మూసివేసింది. ఇక, స్పెయిన్‌లో వచ్చే నెల ఏడో తేదీ వరకు లాక్డౌన్ పొడిగించేందుకు ప్రధాని పెడ్రో శాంచెజ్ పార్లమెంటు ఆమోదాన్ని కోరారు. 
 
భారత్ వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా లాక్డౌన్‌ను ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడగించింది. మరోవైపు, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. ముఖ్యంగా, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ వైరస్‌ దూకుడుకు అడ్డుకట్టలేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆండ్రియా అమ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు