ఐపీఎల్ 2024 : సరికొత్త రికార్డు నెలకొల్పిన సూర్య కుమార్

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (09:58 IST)
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి ఉంచిన 174 పరుగుల విజయలక్ష్యాన్ని సూర్యకుమార్ బ్యాట్‌‍తో రెచ్చిపోవడంతో ముంబై జట్టు సునాయాసంగా గట్టెక్కింది. ఈ క్రమంలో సూర్యకుమార్ 51 బంతుల్లో 102 పరుగులు బాదిన సూర్య ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన సూర్య ఆ తర్వాత రెచ్చిపోయాడు. 12 ఫోర్లు, 6 సిక్సర్లతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఐపీఎల్ కెరియర్లో రెండో సెంచరీని నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్య ఒక ఐపీఎల్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
 
లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. సన్ రైజర్స్‍‌పై  సూర్య కుమార్ యాదవ్ 102 పరుగులు చేయగా, 114 పరుగులతో సనత్ జయసూర్య తొలి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లెండిల్ సిమన్స్, కామెరాన్ గ్రీన్‌లు సూర్య తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ముంబై బ్యాటర్లు వీళ్లే..
1. సనత్ జయసూర్య - 114 నాటౌట్ (2008లో చెన్నై సూపర్ కింగ్స్)
2. సూర్యకుమార్ యాదవ్ - 102 నాటౌట్ (2024లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై) 
3. లెండిల్ సిమన్స్ - 100 నాటౌట్ (కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై)
4. కామెరాన్ గ్రీన్ - 100 నాటౌట్ (2023లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై)
5. కోరీ ఆండర్సన్- 95 నాటౌట్ (2014లో రాజస్థాన్ రాయల్స్‌పై)
 
తిలక్ వర్మతో కలిసి రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పాడు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ తొలుత ఆచితూచి ఆడాడు. కానీ క్రీజులో పాతుకుపోయాక సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 51 బంతులు ఎదుర్కోగా అందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మతో సూర్య కుమార్ యాదవ్ 4వ వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ముంబై ఇండియన్స్ తరపున డ్వేన్ స్మిత్ - సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 163 పరుగుల అజేయ భాగస్వామ్యం తర్వాత సూర్య - తిలక్ వర్మ నెలకొల్పిన 143 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు