పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టరుగా షోయబ్ అక్తర్!!

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (17:03 IST)
పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టరుగా షోయబ్ అక్తర్ నియమితులుకానున్నారు. ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)తో చర్చించినట్లు అక్తర్‌ ధృవీకరించాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా ఆదేశ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ కొనసాగుతున్నాడు.
 
ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాక్‌ పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్రంగా విమర్శలు రావడంతో మిస్బాను కేవలం హెడ్‌ కోచ్‌గానే కొనసాగించి, చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తప్పించాలని పీసీబీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి అక్తర్‌ను పరిశీలిస్తున్నారు. భారత క్రికెట్‌లో మాదిరిగానే స్వదేశీ కోచ్‌లు, కోచింగ్‌ సహాయ సిబ్బందిని పాక్‌ నియమించుకున్నది. 
 
'నేను దీన్ని తిరస్కరించలేను. అవును, బోర్డుతో చర్చలు జరిపాను. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో ప్రధాన పాత్ర పోషించడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. అయితే, ఇప్పటివరకు ఏమీ నిర్ణయించలేదు. ప్రస్తుతం నేను మంచి జీవితాన్ని గడుపుతున్నా. బాగానే స్థిరపడ్డాను. 
 
ఇలాంటి ప్రశాంత జీవితాన్ని విడిచి పీసీబీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతరులకు సలహా ఇవ్వడానికి నేను భయపడను. అవకాశం వస్తే ఏదైనా చేయడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తాను' అని క్రికెట్‌ బాజ్‌ నిర్వహించిన యూట్యూబ్‌ షోలో అక్తర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు