వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పునాది వేశాడు...: శ్రేయాస్ అయ్యర్

గురువారం, 16 నవంబరు 2023 (13:57 IST)
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో భారత తలపడగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంపై సెంచరీ వీరుడు శ్రేయాస్ అయ్యర్ (105) స్పందిస్తూ మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి పునాది వేశాడని చెప్పాడు. ఆయన వంతుగా 47 పరుగులను శరవేగంతో పూర్తి చేశాడని చెప్పాడు. 
 
ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడటం తమకు బాగా కలిసివచ్చిందన్నారు. ఆ శుభారంభాన్ని కొనసాగిస్తూ పరుగులు రాబట్టాం. అతడు ఫియర్‌లెస్ కెప్టెన్. దాంతో మిగిలిన వారిలోనూ అదే దూకుడు కనిపిస్తుంది. మేనేజ్‌మెంట్ కూడా ఎంతో మద్దతుగా నిలుస్తోంది. టోర్నీ ప్రారంభంలో నేను మంచి ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయా. బయట నుంచి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దని సిబ్బంది మద్దతుగా నిలిచారు. 
 
బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టమని సూచించారు. ఒత్తిడి సమయంలోనూ ఎలా ఆడాలనేది తీవ్రంగా శ్రమించా. భారీగా అభిమానుల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం ఎంతో సరదాగా ఉంటుంది. నెట్స్‌లోనూ నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌తోపాటు స్పిన్నర్లను ఎదుర్కొంటూ సాధన చేశా. కొత్త బంతితో బుమ్రాను అడ్డుకోవడం చాలా కష్టం. అందుకే, నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లోనూ ప్రాక్టీస్‌ చేశా. ఇదే ఇలా మ్యాచుల్లో రాణించడానికి సాయపడుతోంది' అని శ్రేయస్ అయ్యర్‌ వెల్లడించాడు. 
 
ప్రపంచ కప్ అంతిమపోరులో భారత్‌ను ఆపడం ఏ జట్టుకైనా అసాధ్యం : కేన్ విలియమ్సన్
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 397 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టి, ప్రపంచ కప్‌ను మూడోసారి ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు భారత్ అని కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారన్నారని, ఫైనల్‌లో వారిని ఆపడం చాలా కష్టమని హెచ్చరించాడు. అదేసమయంలో టీమిండియాకు కేన్ అభినందలు తెలిపారు. 
 
భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డాడు. భారత్ ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభతరం కాదన్నారు. "సాధారణంగా వైఫల్యాలు ఎదరవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ, టీమిండాయ ఈ టోర్నీలో నిజంగానే అద్భుతంగా ఆడుతుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. రౌండ్ రాబిన్ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. సెమీ ఫైనల్‌లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కాగా, గత 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను కివీస్ జట్టు ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇపుడు దానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు