భారత్ - పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైళ్లు

గురువారం, 12 అక్టోబరు 2023 (10:32 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా, భారత్ ఆడిన తన తొలి రెండు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ, బుధవారం ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఇపుడు మూడో మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ తన చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. పైగా, ఇండో-పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటెత్తుతారు. ఈ క్మరంలో ఈ మ్యాచ్ కోసం వచ్చే అభిమానుల కోసం దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేకంగా రెండు రైళ్లను నడిపేందుకు పశ్చిమ రైల్వే సిద్ధమైంది. 
 
ఒక క్రీడా ఈవెంట్‌ కోసం పశ్చిమ రైల్వే రెండు నగరాల మధ్య రైళ్లను నడపడం ఇదే తొలిసారి కానుంది. పూర్తి ఏసీతో కూడిన ఓ రైలు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. అలాగే మ్యాచ్‌ తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరే రైలు ముంబైకు మధ్యాహ్నానికి చేరుకుంటుంది. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆరంభ వేడుకలు లేకుండానే ఈ ప్రపంచకప్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌- పాక్‌ పోరుకు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించనుందని సమాచారం. ఈ కార్యక్రమానికి సచిన్‌ టెండూల్కర్, అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌ను బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతారని అంటున్నారు. ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన ఉండబోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు