'నేను పరమశివుడిని... నిన్ను చంపి మళ్లీ బతికిస్తా'నంటూ 70 యేళ్ళ వృద్ధుడి ఘాతుకం

సోమవారం, 7 ఆగస్టు 2023 (09:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో 70 యేళ్ల వృద్ధుడు కిరాతకంగా ప్రవర్తించాడు. నేను పరమశివుడిని .. నిన్ను చంపి మళ్లీ బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటనను ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు. పైగా, ఈ దారుణ దృశ్యాలను తమ మొబైల్ ఫోనులో చిత్రీకరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి, కిరాతక చర్యకు పాల్పడిన వృద్ధుడిని అరెస్టు చేశారు. 
 
ఈ జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ (70) అనే వృద్ధుడు పూటుగా మద్యం సేవించాడు. దీంతో కైపు తలకు బాగా ఎక్కింది. సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ వృద్ధురాలు కల్కిబాయ్ గమేతి (85)పై తన ప్రతాపం చూపించాడు. తాను పరమ శివుడిని అంటూ ఊగిపోతూ మహిళ ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దెబ్బలకు తాళలేక ఆ వృద్ధురాలు కిందపడిపోయింది. 
 
అయినప్పటికీ వదిలిపెట్టిన ప్రతాప్ సింగ్.. తన చేతిలో ఉన్న గొడుగుతో ఆమెను చావబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన సమయంలో అక్కడ ప్రతాప్ సింగ్‌తో పాటు ఇద్దరు మైనర్లు, నాథూసింగ్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారిలో ఒకరు ఈ దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించారు. కాగా, వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు