కరోనా వైరస్ గొలుసు కట్టును తెంచేందుకు వ్యూహాన్ని రచించిన కేంద్రం

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (20:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గొలుసు కట్టును బ్రేక్ చేసేందుకు కేంద్రం సమూహ నిరోధక వ్యూహం (క్లస్టర్ కంటైన్మెంట్ స్ట్రాటజీ)ని రచించింది. దీన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే సామూహిక సంక్రమణ చెందకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకున్న విషయం తెల్సిందే. ఫలితంగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారకంగా ఉన్నాయని భావిస్తున్న సమూహ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారించింది. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్‌ లక్షణాలున్నవారిని గుర్తించి, స్వీయ నిర్బంధంలోకి లేక ఏకాంతవాసానికి పంపి.. వైరస్‌ గొలుసుకట్టును తెంపడం కోసం సమూహ - నిరోధక వ్యూహాన్ని(క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీ) అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ వ్యూహానికి సంబంధించి కేంద్రం ఓ వ్యూహ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది.
 
ఈ నివేదికలో 'ప్రస్తుత లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ స్థాయి క్రమేణా సమూహ వ్యాప్తికి దారితీయొచ్చు. ప్రయాణాలు లేదా ఒక చోట గుమిగూడడం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా ప్రజాసమూహానికి వ్యాపించొచ్చు. దీన్ని అడ్డుకోవడానికి తొలుత చేయాల్సినది భౌగోళిక స్వీయ నిర్బంధం (జగ్రాఫిక్‌ క్వారంటైన్‌). 
 
ఇది జరగాలంటే లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు, ప్రయాణాలు, బయటకు రావడం.. అన్నీ నిలిచిపోవాలి. సరళంగా చెప్పాలంటే ఆ ఏరియాలను దిగ్బంధం చేసి ఓ అడ్డు (గోడ) కట్టేయాలి. పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతున్న ప్రాంతాలు, హాట్‌స్పాట్లు.. అన్నిచోట్లా ఈ భౌగోళిక క్వారంటైన్‌ను ఖచ్చితంగా అమలు చేయాలి. వాటిచోట్ల పకడ్బందీ నిషేధాజ్ఞలు అమలు చేయాలి' అన కేద్రం తన వ్యూహపత్రంలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు