ముడి చమురు లీటరు ధర నీటి బాటిల్ కంటే తక్కువ.. కానీ స్మార్ట్‌గా నిలువుదోపిడి!

శుక్రవారం, 20 నవంబరు 2020 (08:08 IST)
దేశంలో చమురు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గతంలో పెట్రోల్ - డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 20 రూపాయల వరకు ఉండేది. కానీ ఇపుడు ఈ రెండు ధరల్లో పోటీపడుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరను డీజిల్ ధర దాటేసింది. ఇపుడు లీటర్ పెట్రోల్ 87 రూపాయలకు విక్రయిస్తుండగా, లీటర్ డీజిల్ ధర రూ.79 వరకు పలుకుతోంది. 
 
నిజానికి మన దేశంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20. దీనికికంటే తక్కువగా ముడి చమురు లభిస్తోంది. కానీ వినియోగదారులపై పెను భారం మోపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర సుమారు 40 డాలర్లుగా ఉంది. గత బుధవారం నాటికి మన దేశ కరెన్సీలో సుమారు రూ.2,966. ఒక బ్యారెల్‌లో 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది. 
 
ఈ లెక్కన ముడి చమురు ఖరీదు లీటర్‌కు రూ.18.65 పడుతుంది. అంటే నీళ్ల బాటిల్‌ కన్నా తక్కువకే ముడి చమురు వస్తున్నది. దిగుమతి ఖర్చులు, రవాణా నష్టం, రిఫైనరీ, పెట్రోల్‌ బంకుల వరకు రవాణా, ఇతర నిర్వహణ ఖర్చు లు వంటివి సంస్థాగత వ్యయాలు. 
 
ఇవన్నీ చూసుకున్నా ప్రాథమిక ధర రూ.25కు మించదని నిపుణులు చెప్తున్నారు. ఈ చమురు ఉత్పత్తులపై ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకొంటే లీటర్‌ పెట్రోల్‌ లేదా డీజిల్‌ రూ.40-50 లోపే వినియోగదారుడికి లభిస్తుంది. 
 
కానీ, బుధవారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.84.25, డీజిల్‌ రూ.76.84గా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను పెట్రోల్‌పై రూ.32.98, డీజిల్‌పై రూ.31.83. అంటే పెట్రోల్‌, డీజిల్‌ కొన్నప్పుడు 40 శాతం డబ్బును నేరుగా సామాన్యుల జేబుల్లో నుంచి కేంద్రం తీసుకుంటున్నదన్నమాట. 
 
2014 జూన్‌లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. అప్పుడు చమురు బ్యారెల్‌ ధర 109 డాలర్లు. అప్పట్లో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.71, డీజిల్‌ రూ.59గా ఉండేది. ఇప్పుడు చమురు ధర 40 డాలర్లకు పడిపోయింది. ఈ లెక్కన పెట్రోల్‌ రూ.35కు, డీజిల్‌ రూ.30కి లభించాలి. 
 
కానీ అంతకు రెండున్నర రెట్లు ధర ఎక్కు వగా ఉన్నది. దీనికి ప్రధాన కారణం కేంద్రం అడ్డగోలు వసూళ్లు. 2014తో పోల్చితే కేంద్ర ప్రభుత్వ పన్నులు పెట్రోల్‌పై మూడు రెట్లు పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని గడిచిన ఆరేండ్లలో ఏకంగా 15 సార్లు సవరించటం గమనార్హం. 
 
ప్రధాని మోడీ సర్కారు కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తర్వాత 2014 నుంచి 2020 వరకు ఆరేండ్లలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై 15 సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్ళ కాలంలో చమురుపై పన్ను పెంచడం ద్వారా సుమారు రూ.11 లక్షల కోట్ల అదనపు ఆదాయం సంపాదించింది. అంటే 130 కోట్ల జనాభాలో సగటున ఒక్కొక్కరి నుంచి రూ.8,400 వసూలు చేసింది. స్మార్ట్‌గా నిలువు దోపిడీ చేయడం అంటే ఇదే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు