మధుమేహం వచ్చిందా? ఐతే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

సిహెచ్

మంగళవారం, 9 జనవరి 2024 (12:35 IST)
మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇది ఒకటి. వంశపారంపర్యం, జీవనశైలి కారణంగా మధుమేహం వ్యాధి తలెత్తుతుంది. డయాబెటిస్ వ్యాధి వచ్చాక దాన్ని అదుపులో వుంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతిరోజూ 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తూ శరీర బరువును అదుపులో వుంచుకోవాలి.
డయాబెటిస్ మందులు భోజనానికి అరగంట ముందుగా వేసుకోవాలి. సమయానికి వేసుకోకపోతే అవి నిష్ఫలం అవుతాయి.
 
మధుమేహం వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ తీసుకునేవారు నిర్ణీత సమయానికే ప్రతిరోజూ తీసుకుంటూ వుండాలి. భోజనం చేసే సమయం కూడా ప్రతిరోజూ ఒకే సమయానికి తీసుకుంటూ వుండాలి. కాళ్లలో స్పర్శపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, స్పర్శ లేనట్లనిపిస్తే కనీసం 3 నెలలకోసారి పరీక్ష చేయించుకుని మందులు వాడాలి.
 
ప్రతిరోజూ పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి, అలాగే పాదాలపై గాయాలు కాకుండా చూసుకోవాలి. కళ్లు, కిడ్నీలు, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు పరీక్షలు వైద్యుని సలహా మేరకు చేయించుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీల టెస్ట్ చేయించుకుని ఆల్బుమిన్ ప్రోటీన్ స్థాయిలను తెలుసుకుంటుండాలి.
 
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఏటా గుండె ఆరోగ్యానికి సంబంధించి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్ టెస్టులు చేయించుకోవాలి. పిండిపదార్థాలు, ధాన్యాల మోతాదు తగ్గించి పీచుపదార్థాలు అధికంగా వుండే కూరగాయలను తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు