ఏడేళ్ల కిందట ఓ జంట దాచుకున్న వీర్యం, సంతాన భాగ్యం కలిగించింది

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:24 IST)
ఏడేళ్ల కిందట ఓ జంట దాచుకున్న వీర్యం ఇప్పుడు వారికి సంతాన భాగ్యం కలిగించింది. ఆ సమయంలోనే ముందు జాగ్రత్తతో వీర్యాన్ని భద్రపర్చుకోగా తాజాగా ఆ జంటకు పంటంటి బిడ్డ పుట్టింది. ఈ అరుదైన పరిణామం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ విషయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒయాసిస్‌ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
 
పూర్తి వివరాలివీ.. ఎనిమిదేళ్ల కిందట అంటే 2012లో ఓ జంటకు వివాహమైంది. కానీ, దురదృష్టవశాత్తు పెళ్లయిన ఏడాదికే భర్త తరుణ్‌కు క్యాన్సర్‌ సోకింది. తరుణ్ ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్‌ ట్యూమర్‌ (క్యాన్సర్‌ కణితి) ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఇతనికి అప్పుడు 23 ఏళ్లు. అయితే, వైద్యుల సలహా మేరకు క్యాన్సర్ చికిత్స ప్రారంభించే ముందే అతను తన వీర్యాన్ని సేకరించి జాగ్రత్తగా స్పెర్మ్‌ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దీంతో 2012లో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఫెర్టిలిటీ కేంద్రంలో ఆయన వీర్యాన్ని భద్రపరచుకున్నాడు.
 
 
గతేడాది క్రితం తరుణ్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా అతనికి కీమోథెరపీ, రేడియో థెరపీలు చేయాల్సి వచ్చింది. ఈ పద్ధతుల వల్ల తరుణ్ పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని కోల్పోయాడు. దీంతో ముందు జాగ్రత్తగా స్పెర్మ్‌ బ్యాంకులో దాచుకున్న వీర్యం ద్వారా సంతానం పొందవచ్చునని వైద్యులు చెప్పారు. గతేడాది తరుణ్ క్యాన్సర్ నుంచి కోలుకోగానే ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించి చికిత్స ప్రారంభించారు.
 
ఐసీఎస్‌ఐను మాక్స్‌(మాగ్నెటిక్‌ యాక్టివేటెడ్‌ సెల్‌ సార్టింగ్‌) వంటి అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తల్లి కడుపులో ప్రవేశపెట్టారు. ఇది ఫలించి గత వారం ఆ మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఈ పరిణామం ఓ అరుదైన ఘటన అని ఆయన వివరించారు. ముందు జాగ్రత్త చర్యతో వీర్యం దాచుకోవడంతో ఆ దంపతులు సంతానభాగ్యాన్ని పొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు