బాయ్‌కాట్ ఇండియా కాదు.. ముందు మీ భార్యల చీరలు తగలబెట్టండి..!!

ఠాగూర్

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (14:49 IST)
బాయ్‌కట్ ఇండియా కాదు... ముందు భారతదేశంలో కొనుగోలు చేసి తెచ్చుకుని మీ భార్యలు ధరిస్తున్న చీరలను తగలబెట్టాలని తమ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. భారత్‌ను ఆమె గొప్ప స్నేహితుడుగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) 'బాయ్‌కాట్ ఇండియా' అనే నినాదంతో ముందుకు సాగుతుంది. దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష నేతలపై ఆమె మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ బీఎన్పీ నేతలు తొలుత వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఎన్పీ అధికారంలో ఉన్నపుడు వారి భార్యలు భారత్‌కు వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు తెలుసన్నారు. అక్కడ కొనుగోలు చేసిన చీరలను వారు బంగ్లాదేశ్‌లో అమ్ముకునే వారన్నారు. భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్పీ నాయకులు ఎందుకు వండుకోకూడదని ప్రశ్నించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు లేకుండా వారు వంటలు చేసుకోవాలని సూచించారు. ఇవి లేకుండా వారు ఆహారం తినగలరా అని ప్రధాన షేక్ హసీనా ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి