ఫింగర్ 4 నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు : చైనా మొండిపట్టు

గురువారం, 16 జులై 2020 (13:52 IST)
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది. ఈ వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు బుధవారం సుధీర్ఘంగా 15 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో చైనా తన వైఖరిని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పింది. 
 
ముఖ్యంగా, పాంగాంగ్ త్సో‌ లోని ఫింగర్ 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లబోమని చైనా చెప్పింది. దీంతో లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబ‌డి భారత్, చైనాల‌ మధ్య ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో మ‌రింత‌ పెరిగే అవకాశం ఉంది. 
 
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి వచ్చే ముప్పును నివారించడానికి హై అల‌ర్ట్‌లో ఉన్న భార‌త సైన్యం తూర్పు ల‌డఖ్ స‌రిహ‌ద్దులో భారీగా యుద్ధ ట్యాంకుల‌ను మోహ‌రిస్తుంది. మరోవైపు, శుక్ర, శనివారాల్లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్, జమ్మాకాశ్మీర్‌ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో ఎల్ఏసీ వెంట ఉన్న పరిస్థితులను వివ‌రించేందుకు చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులను కలిసి అక్క‌డి ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు. 
 
భారత్‌, చైనాల మ‌ధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు 14 గంటలపాటు సుదీర్ఘంగా కొన‌సాగి బుధవారం తెల్ల‌వారుజామున ముగిశాయి. అయితే ఈ చర్చల సమయంలో చైనా ఫింగర్ 4 నుండి వెనక్కి తగ్గేది లేద‌ని స్పష్టం చేసిన‌ట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి. 
కానీ భారత్ మాత్రం గాల్వన్ వ్యాలీ, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి చైనా ద‌ళాలు పూర్తిగా వైదొల‌గాల‌ని డిమాండ్ చేసింది. చైనా సైన్యం కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం తీవ్ర అప్రమత్తంగా ఉంది. 
 
భారత భూభాగాల్లో చైనా సైనికుల చొరబాటును ఆపడానికి తూర్పు లడఖ్‌లో సుమారు 60 వేల మంది సైనికులను మోహ‌రించారు. అదేవిధంగా ఎల్ఏసి సమీపంలో భీష్మ ట్యాంకులు, అపాచీ అటాక్ హెలికాప్టర్లు, సుఖోయ్ ఫైటర్ జెట్‌లు, చినూక్, రుద్ర హెలికాప్టర్లను మోహరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు