పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు : ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయ్...

ఠాగూర్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (10:07 IST)
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా, ఫలితాలు వెలువడ్డాయి. అయితే, అనేక ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపిస్తూ పలువురు గెలిచిన అభ్యర్థులు సైతం గెలుపును త్యజిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 265 మంది సీట్లు ఉండే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరగాయి. ఈ ఫలితాల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్-ఎన్ పార్టీకి 75 సీట్లు వచ్చాయి. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడైన బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లను దక్కించుకుంది. అలాగే, మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ ఏకంగా 101 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈ మూడు పార్టీలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో నవాజ్ షరీఫ్ - బిలావల్ భుట్టోలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే మాత్రం 129 సీట్లు లభిస్తాయి. అలాగే, ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నవాజ్ షరీఫ్ పార్టీలో చేరారు. మరో 17 సీట్లను గెలుచుకున్న ఎంక్యూఎం-పీతో నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు. దీంతో నవాజ్ షరీఫ్ సారథ్యంలో పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
మరోవైపు పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతామని తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్థాన్​లో నెలకొన్న పరిస్థితులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పాక్​లో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు