సరిహద్దుల మార్పు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే : భారత్

బుధవారం, 5 ఆగస్టు 2020 (10:12 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుద్ధి వక్రమార్గంలో పయనిస్తోంది. ఫలితంగా తమ దేశ సరిహద్దులు మార్చేశారు. ముఖ్యంగా, భారత్‌లోని పలు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ సరికొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ మ్యాప్‌పై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇష్టానుసారంగా సరిహద్దుల మార్పు అనేది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అవుతుందని ప్రకటించింది. పైగా, పాకిస్థాన్ సరికొత్త మ్యాప్‌ను ప్రపంచంలోని ఏ దేశం కూడా నమ్మబోదని స్పష్టం చేసింది. 
 
భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌తో పాటు.. గుజరాత్‌ ప్రాంతాలను తమవిగా చూపించుకుంటూ పాకిస్థాన్ మంగళవారం సరికొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ, భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంత వాసులంతా, తాము పాక్‌తోనే ఉన్నామని, ఇండియా తమపై దాష్టీకాలు చేస్తోందని మొరపెట్టుకున్నారని ఈ సందర్భంగా ఇమ్రాన్ కాన్ ఆరోపించారు. అందుకే, తాము కొత్త మ్యాప్‌ను విడుదల చేస్తున్నామన్నారు. కాశ్మీర్ వాసులంతా ఇక తమవారేనని వ్యాఖ్యానించింది. ఇకపై దేశంలోని అన్ని పాఠశాలల్లో ఇదే మ్యాప్ ఉంటుందని కూడా ఆయన అన్నారు.
 
దీనిపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఇదంతా ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న అసంబద్ధ నిర్ణయమని మండిపడింది. ఏ మాత్రమూ ప్రపంచ ఆమోదంలేని ఈ మ్యాప్‌ను ఎవరూ పట్టించుకోబోరని వ్యాఖ్యానిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది.
 
'తమదేశపు రాజకీయ చిత్రపటంగా పాకిస్థాన్ పేర్కొన్న మ్యాప్‌ను చూశాము. దీన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేశారు. ఇది రాజకీయ అసంబద్ధతే. సరిహద్దుల విషయంలో చెప్పే అబద్ధాలను ఏ మాత్రమూ అంగీకరించబోము. 
 
ఇండియాలో భాగమైన గుజరాత్, మా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లపై ఎవరూ ఆమోదించని వాదనలను పాక్ చేస్తోంది అని వ్యాఖ్యానించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలన్న పాకిస్థాన్ కుతంత్రం దీని వెనుక ఉందని ఆరోపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు