పాక్ ప్రియుడికి ఝులక్ ఇచ్చిన స్వదేశానికి వచ్చిన అంజు

గురువారం, 30 నవంబరు 2023 (08:24 IST)
పాకిస్థాన్ ప్రియుడికి ఝులక్ ఇచ్చిన అంజు తిరిగి స్వదేశానికి వచ్చేసింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్థాన్ వ్యక్తితో మనసు పారేసుకున్న అంజూ... అతనిని పెళ్లి చేసుకునేందుకు గత యేడాది జూలై నెలలో భారత్‌ను వీడి పాకిస్థాన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. తన ఇద్దరు కన్నబిడ్డలను కూడా వదిలేసి ప్రియుడి కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడా అంజు పిల్లల కోసం తిరిగి భారత్ వచ్చింది. వాఘా అట్టారీ బోర్డర్ వద్ద ఆమె భారత్‌లోకి ప్రవేశించింది. ఒక్కతే వచ్చిన అంజూ చేతిలో కొంత లగేజి మాత్రమే ఉందని, ఆమె ప్రశాంతంగా కనిపించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆమె అమృత్ సర్ నుంచి ఢిల్లీ వెళ్లనుంది. అంజు స్వస్థలం ఉత్తరప్రదేశ్. 
 
వివాహమైన తర్వాత రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. అక్కడ పిల్లలు, భర్తతో కాపురం సాగిపోతుండగా... పాకిస్థాన్‌‌కు చెందిన నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 2019లో మొదలైన అంజు - నస్రుల్లా ఫేస్‌బుక్ స్నేహం ప్రేమగా మారింది. దాంతో ప్రియుడిని ఎలాగైనా కలవాలని భావించిన అంజూ అందరినీ వదిలేసి పాకిస్థాన్ చేరింది. అక్కడి ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో ఉండే తన ప్రియుడు నస్రుల్లాని కలిసి అతడిని పెళ్లాడింది.
 
అంజు వయసు 34 ఏళ్లు కాగా, నస్రుల్లా వయసు 29 సంవత్సరాలు. పెళ్లి తర్వాత అంజు ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. కాగా, అంజు భారత్ తిరిగి రావడంపై పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె తన కుమారుడు, కుమార్తెను చూశాక తిరిగి పాకిస్థాన్ వచ్చేస్తుందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఆమె వీసాను మరో ఏడాది పొడిగించినట్టు కూడా కథనాల్లో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు