అమెరికా లేకుంటే భారత్ పాక్ యుద్ధం జరిగేదట

సోమవారం, 18 మార్చి 2019 (12:51 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన పాక్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాకిస్థాన్ కూడా తమ యుద్ధ విమానాలను భారత్‌పైకి పంపింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్ పాక్‌ల మధ్య యుద్ధం దాదాపుగా ప్రారంభమైంది అయితే అమెరికా మధ్యవర్తిత్వం కారణంగా యుద్ధం తృటిలో తప్పిందని తాజాగా తెలిసింది. 
 
ఈ విషయాన్ని ఆదివారం భారత నావికాదళం వెల్లడించింది. భారత్ సర్జికల్ స్టైక్స్ చేసిన తర్వాత అరేబియా సముద్రంలో ఉత్తర భాగాన భారీగా యుద్ధ నౌకలను మొహరించినట్లు భారత నేవీ వెల్లడించింది. వీటిలో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో సహా అణు జలాంతర్గాములు, యుద్ధ విమానాలను మోహరించినట్లు నేవీ తెలిపింది. ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు రక్షణగా ఐఎన్ఎస్ చక్రాను కూడా రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.
 
బాలాకోట్‌పై వాయుసేన దాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నౌకాదళ విన్యాసాలు చేస్తున్న నావికాదళం తక్షణమే విన్యాసాలను ఆపివేసి, విన్యాసాల్లో పాల్గొంటున్న 60 యుద్ధ నౌకలు, కోస్టు గార్డ్‌కు చెందిన 12 నౌకలు, 60 యుద్ధ విమానాలను అక్కడి నుండి నేరుగా అరేబియా సముద్రంలో ఉత్తరవైపుకు తరలించింది. ఆ సమయంలో పాక్‌పై భారత్ ఆరు క్షిపణులను ఎక్కుపెట్టింది, మరోవైపు పాక్ కూడా భారత్‌పై క్షిపణులను ఎక్కుపెట్టింది. ఈ పరిస్థితి యుద్ధానికి దారి తీస్తుండటంతో అమెరికా కల్పించుకోవడంతో యుద్ధం తప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు