దేశాధ్య ఎన్నికల ఫలితాలపై తృప్తి లేదు.. నిబంధనలు పాటిస్తూ... : ట్రంప్

గురువారం, 7 జనవరి 2021 (16:18 IST)
గత యేడాది నవంబరు నెలలో జరిగిన అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఆయనపై జో బైడెన్ కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈయన గెలుపును అమెరికా పార్లమెంటు గురువారం నిర్థారించింది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు సంతృప్తికరంగా లేనప్పటికీ, నిబంధనలు పాటిస్తూ అధికారాన్ని జో బైడెన్‌కు అప్పగిస్తున్నానని స్పష్టంచేశారు.
 
ట్రంప్ ప్రకటనతో అమెరికాలో అధికార మార్పిడికి మార్గం ఏర్పడినట్టయింది. అలాగే, ఈ నెల 20వ తేదీన అమెరికా 40వ అధ్యక్షుడుగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బైడెన్‌కు అధికార మార్పిడికి సంపూర్ణ సహకారం అందిస్తానని ట్రంప్ ప్రకటించారు.
 
అదేసమయంలో ఎన్నికల ఫలితాలపై తమ పోరాటం మాత్రం ఆగదని తేల్చిచెప్పారు. అమెరికా తన గత వైభవాన్ని పొందేందుకు చేసే పోరాటంలో ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన చేశారు. 
 
ఈ ప్రకటన ద్వారా ఎన్నికల్లో తన ఓటమిని ఆయన అంగీకరించినట్టయింది. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు పోటీ చేసేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, అమెరికా కాంగ్రెస్ సమావేశానికి ముందు ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ హిల్స్‌పై దాడికి పాల్పడిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు