చైనాకు షాక్ : భారత సముద్రజలాల్లో అమెరికా యుద్ధనౌకలు

మంగళవారం, 21 జులై 2020 (09:10 IST)
భారత్ మరోమారు చైనాకు తేరుకోలేని షాకిచ్చింది. భారత సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌకలకు అనుమతి ఇచ్చింది. ఈ యుద్ధ నౌకలు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకలు కావడం గమనార్హం. అంతేనా... భారత్ - అమెరికా దేశాల నౌకాదళ సిబ్బంది సంయుక్తంగా సైనిక విన్యాసాలను చేపట్టనున్నాయి. 
 
ఇటీవల తూర్పు లఢక్‌లోని గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులు పాల్పడిన దుశ్చర్యకు వీలుగా వీలు చిక్కినప్పుడల్లా చైనాకు భారత్ గట్టి షాకిస్తూనే వుంది. తాజాగా అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలతో కలిసి సైనిక విన్యాసాలను భారత్‌ నిర్వహించింది. 
 
చైనాకు తమ సైనిక సామర్థ్యం గురించి వ్యూహాత్మక హెచ్చరికలు చేయడంలో భాగంగానే భారత్‌ అమెరికాతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సోమవారం నిర్వహించిన ఈ పాసింగ్‌ ఎక్సర్‌సైజ్‌లో అమెరికాకు చెందిన నిమిజ్‌, రోనాల్డ్‌ రేగన్‌ యుద్ధ నౌకలతో పాటు భారత్‌కు చెందిన పలు గస్తీ నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. 
 
కాగా దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలను చేస్తున్న డ్రాగన్‌ దేశానికి బుద్ధి చెప్పడంలో భాగంగా అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇటీవల ఆ సముద్ర జలాల్లో మోహరించింది. తద్వారా తమ మిత్ర దేశాలకు అమెరికా మద్దతును ప్రకటించినట్టయింది.
 
పైగా, చైనాపై అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యవహారంలో ప్రపంచాన్ని మోసం చేసిందని, అది కరోనా వైరస్ కాదనీ... చైనీస్ వైరస్ అంటూ ట్రంప్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలను మొహరించారు. ఈ ఘటనకు ముందు.. జపాన్‌కు అండగా ఉండేలా హిందూ మహాసముద్ర జలాల్లో కూడా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు లంగర్ వేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు