బైడెన్‌కు జై కొడుతున్న అమెరికా యువత.. ట్రంప్‌కు ఓటమి తప్పదా?

బుధవారం, 28 అక్టోబరు 2020 (13:12 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ వచ్చే నెల మూడో తేదీన జరుగనుంది. అయితే, ఆ రోజున ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోలేని వారు ముందుగా ఓటు వేసే వెసులుబాటు ఉంది. దీంతో ఈ అవకాశాన్ని చాలా మంది ఇప్పటికే సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. అయితే, ఈ దఫా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతారనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి కారణం అమెరికా యువతే. దేశంలోని యువత అంతా ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్‌కు జై కొడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది.
 
గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అధ్యక్ష ఎన్నికలపై యువత అమితాసక్తి  కనబరుస్తున్నట్టు హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. వయసు 18-29 ఏళ్ల మధ్యనున్నవారిపై సర్వే చేశారు. 
 
వీరిలో 63 శాతం మంది తాము తప్పకుండా ఓటుహక్కు వినియోగించుకుంటామని తెలిపారు. 2016 ఎన్నికల్లో 47 శాతం మంది యువత మాత్రమే ఓటు వేయగా, ఈసారి అది గణనీయంగా పెరగనున్నట్టు సర్వే పేర్కొంది. 
 
మరోవైపు, ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు యువతలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. యువ ఓటర్ల మద్దతు విషయంలో ట్రంప్ కంటే బైడెన్ 24 పాయింట్లు ముందున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం 56 శాతం మంది బైడెన్‌కే జై కొడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు