చెత్త అంపైరింగ్‌ వల్ల ఓడిపోయాం : ప్రీతి జింటా మండిపాటు

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:18 IST)
కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాకు పట్టరాని కోపం వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల ఓడిపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్ చెత్త నిర్ణయం వల్ల తమ జట్టు ఓటమిపాలైందని ఆమె విమర్శించారు. 
 
ఐపీఎల్ 2020 టోర్నీలోభాగంగా, ఆదివారం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రెండో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో గెలుపు ముంగిట పంజాబ్ జట్టు పోల్తాపడింది. ఓటమి ఖాయమనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం బోణీ చేసింది. అయితే, పంజాబ్‌ చేజింగ్‌ చేస్తున్న సమయంలో 19వ ఓవర్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల విమర్శలు వస్తున్నాయి. 
 
రబాడ బౌలింగ్‌లో 18వ ఓవర్ మూడో బంతిని ఆడిన మయాంక్ అగర్వాల్ రెండు పరుగులు చేస్తే.. మరో ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ బ్యాటును క్రీజులో పెట్టలేదంటూ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఓ పరుగును తొలగించారు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తుండడంతో దీనిపై పంజాబ్‌ యజమాని ప్రీతిజింటా ట్విట్టర్‌ ఖాతాలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
 
ఒక షార్ట్‌ రన్‌ తనను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. క్రికెట్‌లో టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటని నిలదీసింది. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను ఎప్పుడూ ఆటలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తానని ఆమె తెలిపింది. క్రికెట్‌ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరింది. భవిష్యత్‌లో తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని కోరింది. 
 
అంపైర్ తప్పుడు నిర్ణయంపై వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాలు విమర్శలు కురిపించారు. ఒక పరుగు కోత విధించిన అంపైర్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని సెహ్వాగ్ చలోక్తి విసిరారు. ఇప్పుడు కోల్పోయిన రెండు పాయింట్లతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోతే పరిస్థితి ఏంటని చోప్రా ప్రశ్నించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు