ఐపీఎల్ 2020 : పంజాబ్ వర్సెస్ బెంగుళూరు .. ఉరకలేస్తున్న కోహ్లీ సేన

గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:59 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా గురువారం ఆరో లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సాధించిన కోహ్లీ సేన.. ఈ మ్యాచ్ కోసం ఉరకలేస్తోంది. అదేసమయంలో ఢిల్లీపై అసాధారణ ఆటను కనబరిచినా పంజాబ్‌కు సూపర్ ఓవర్‌లో ఓటమి తప్పలేదు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. 
 
బెంగుళూరు జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బెంగళూరు ఈసారి కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఓపెనర్లు దేవ్‌దూత్ పడిక్కల్, అరోన్ పించ్‌లు ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేరళ కుర్రోడు పడిక్కల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక, ఫించ్ చెలరేగితే కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టం. 
 
మరోవైపు డివిలియర్స్ రూపంలో అరుదైన అస్త్రం ఉండనే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు జట్టులో కొదవలేదు. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం బెంగళూరు ఏమాత్రం కష్టం కాదు. 
 
ఇక బౌలింగ్‌లోనూ బెంగళూరుకు ఎదురు లేదు. చాహల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. స్టెయిన్, ఉమేశ్ యాదవ్, శివమ్ దూబే, సైని తదితరులతో బెంగళూరు బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
 
అలాగే, పంజాబ్ ఈ టోర్నీలో తొలి గెలుపును నమోదు చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమి పాలైన పంజాబ్ ఈసారి గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన మయాంక్ అగర్వాల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అతను విజృంభిస్తే పంజాబ్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. 
 
ఇక కెప్టెన్ రాహుల్ కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆరంభ మ్యాచ్‌లో రాహుల్, మ్యాక్స్‌వెల్, పురాన్ తదితరులు విఫలమయ్యారు. దీంతో పంజాబ్ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. ఈసారి మాత్రం మెరుగైన ఆటతో బెంగళూరును కంగుతినిపించాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 24 సార్లు తలపడ్డాయి. అందులో పంజాబ్ జట్టు 12, ఆర్సీబీ 12 సార్లు చొప్పున గెలుపొందాయి. ఈ రెండు జట్లు తలపడిన గత యేడాది తలపడగా, అపుడు ఏబీ డివిలియర్స్ వీరవిహారం చేసి 82 (నాటౌట్)గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు