భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తున్న యాపిల్... ఏప్రిల్ 5 నుంచి...

గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:05 IST)
యాపిల్‌ ఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్త. యాపిల్ కంపెనీ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ మోడల్‌లోని అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది.
 
ప్రస్తుతం 64 జీబీ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 76,900, డిస్కౌంట్ పోను ఇది రూ. 59,900కే రానుంది. ఇక 128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 కాగా రూ. 64,900కి లభించనుంది. ఐఫోన్‌ 256జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు తగ్గనుంది. ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది. ఈమధ్య కాలంలో భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువగా ఉండటంతో పాటు షియోమీ వంటి కంపెనీల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఐఫోన్‌ విక్రయాలు మందగించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను తీసుకొచ్చిందని యాపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు