మదురై రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలులో అగ్నిప్రమాదం.. పదికి పెరిగిన మృతులు

శనివారం, 26 ఆగస్టు 2023 (10:57 IST)
తమిళనాడు రాష్ట్రంలోని మదురై రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులోని ప్యాంట్రీకార్‌ బోగీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరింది. శనివారం తెల్లవారుజామున 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పది మంది చనిపోయారు. రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ తయారు చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి ఓ ప్రైవేటు పార్టీ కోచ్‌ను కొందరు భక్తులు తమ ఆధ్యాత్మిక పర్యటన కోసం బుక్ చేసుకున్నారు. వీరు రామేశ్వరం వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్‌ వద్ద దీన్ని పునలూరు - మదురై ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అటాచ్‌ చేశారు. ఆదివారం రాత్రి మదురై రైల్వే స్టేషన్‌ వద్ద దీన్ని డిటాచ్‌ చేసి స్టాబ్లింగ్‌ లైన్‌లో నిలిపి ఉంచారు.
 
అయితే, ఈ ప్రైవేట్‌ పార్టీ కోచ్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి రహస్యంగా గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు.
 
సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు