ఉత్తరప్రదేశ్‌లో 50 మంది వలస కార్మికులకు కరోనా- 24గంటల్లో రికార్డ్

బుధవారం, 20 మే 2020 (10:18 IST)
Migrants labours
ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికుల శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో 50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వలస కూలీలంతా గత వారం మహారాష్ట్ర నుంచి సొంత జిల్లా అయిన బస్తీకి చేరుకున్నారు. కూలీలందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. 
 
కరోనా బాధితులందరినీ ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 50 మందితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా మొత్తంగా బస్తీ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 104కు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి 28 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
మరోవైపు భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ విధించినా కానీ కరోనా కేసులు తగ్గలేదు. ప్రస్తుతం పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో ఇంకా ఏం చేస్తుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
 
ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 140 మంది కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,303కు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు