కన్నెర్రజేసిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. సెలవు పెట్టిన ఉద్యోగులపై వేటు!!

ఠాగూర్

గురువారం, 9 మే 2024 (12:55 IST)
దేశంలో చౌకధర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం కన్నెర్రజేసింది. సెలవు పెట్టిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. గత కొన్ని రోజులుగా ఈ సంస్థ యాజమాన్యం, క్రూ సిబ్బంది మధ్య వివాదం చెలరేగింది. ఇది రోజురోజుకూ ముదురుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 30 మంది క్రూ సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది. సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. సరైన కారణం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా సెలవులు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సంస్థ మరిన్ని తొలగింపులు చేపట్టే అవకావం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.
 
కాగా, మంగళవారం ఒకేసారి 300 మంది విమానం క్రూ (సిబ్బంది) అనారోగ్య సెలవులు పెట్టడంతో దేశ వ్యాప్తంగా సుమారు 100కు పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా, మంగళ, బుధవారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ప్రభావం దాదాపు 15 వేల మంది ప్రయాణికులపై పడింది. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ క్రూ కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్... ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనం అవుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై క్రూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఉద్యోగులతో సంస్థ సమభావంతో వ్యవహరించట్లేదని, ఉన్నత బాధ్యతలకు అర్హత ఉన్నా దిగువ స్థానాలకే కొందరిని పరిమితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ పారితోషికానికి సంబంధించి నిబంధనల్లో మార్పులను కూడా నిరసిస్తున్నారు. టాటాకు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్‌లలో పైలట్ల జీతాలపై వివాదం ముగిసిన కొద్ది రోజులకే ఈ వివాదం తలెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. తన ఫ్లైట్ రద్దైందీ లేనిదీ ఓసారి చెక్ చేసుకున్నాకే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు రావాలని సూచన చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు