మైనర్ బాలిక చేతిలో హతమైన తాగుబోతు టెక్కీ తండ్రి.. ఎక్కడ?

శనివారం, 25 జులై 2020 (11:13 IST)
బెంగుళూరు నగరంలో ఓ తాగుబోతు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తండ్రి మైనర్ కుమార్తె చేతిలో హతమయ్యాడు. పీకలవరకు మద్యం తాగొచ్చి కన్నబిడ్డపై దాడి చేయబోయాడు. దీంతో ఆ బాలిక తిరగబడి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన ఆ తాగుబోతు టెక్కీ.. ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈయన భార్య తొమ్మిదేళ్ళ క్రితం చనిపోయింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉండగా, కుమార్తె వయసు 15, కుమారుడు వయసు 9 యేళ్లు. 
 
అయితే, భార్య చనిపోయిన తర్వాత పిల్లలతో కలసి అతడు మీకో లేఅవుట్‌లో నివసిస్తూ వచ్చాడు. అయితే, పిల్లలకు చదువును ఇంట్లోనే ఓపెన్ స్కూలు విధానంలో చెప్పించసాగాడు. 
 
ఈ క్రమంలో మద్యం అలవాటు ఉన్న ఈ టెక్కీకి.. అపుడపుడూ మద్యం సేవించి వచ్చి.. పిల్లలను వేధించసాగాడు. ఈ క్రమంలో గత గురువారం మద్యం సేవించివచ్చి 15 యేళ్ల మైనర్ బాలికపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ యువతి తిరగబడి తండ్రిపై దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తండ్రి తనపై కత్తెరతో దాడిచేయబోతుంటే.. తాను ఎదురుదాడికి దిగానని, ఆ పెనుగులాటలో తండ్రికి తీవ్రగాయాలై చనిపోయాడని కూతురు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 
 
ఈ కేసులో నిందితురాలు బాలిక మైనర్ కావడంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ బాలల సంరక్షణాలయానికి తరలించారు. ఆమె చెబుతున్నది నిజమా కాదా తేల్చుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు