మా రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయం : కేరళ సీఎం విజయన్

ఠాగూర్

మంగళవారం, 12 మార్చి 2024 (10:26 IST)
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం 2019ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తేల్చి చెప్పారు. ఈ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏను అమల్లోకి తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై సీఎం విజయన్ స్పందించారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో తాము అమలు చేయడం లేదని తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పామని ఆయన గుర్తు చేశారు. సీఏఏ చట్టాన్ని వ్యతిరేకంగా యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తగినరీతిలో స్పందిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వివాదాస్పద ఎన్నికల బాండ్ల అంశం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరపైకి తెచ్చారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఏఏఏ రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మన దేశానికి చెందినవారే విదేశాల బాట పట్టినపుడు ఇతరుల కోసం పౌరసత్వ సవరణ చట్టం అమలు వల్ల ప్రయోజనం ఏమిటని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. గత పదేళ్లలో లక్ష మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెచ్చిన కేంద్రం.. నోటిఫికేషన్ జారీ 
 
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - 2019ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 2019లో ప్రతిపక్షాల నిరసనల మధ్య సీఏఏకి ఆమోదముద్ర వేయించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఈ చట్టంలోని నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమలులో ఇన్నాళ్లపాటు జాప్యం జరిగింది. 
 
2019లో సీఏఏ చట్టం తీసుకొచ్చారు. పార్లమెంట్‌లో దీనిపై విపక్షాలు తీవస్థాయిలో నిరసనలు వ్యక్తంచేశాయి. ఉభయసభల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఉన్న బలం దృష్ట్యా సీఏఏకి పార్లమెంట్ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి కూడా రాజముద్ర వేశారు. అయితే, సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో దీని అమలు ఆలస్యమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏ అమలుపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించిన మేరకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఈ చట్టం అమలు తర్వాత పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి ముస్లిమేతరులు వలస వస్తే, వారివద్దసరైన పత్రాలు లేకపోయినా, భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ ఉపయోగపడుతుంది. 2014 డిసెంబరు 31వ తేదీకి ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌లో ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ ఉపకరిస్తుంది. అయితే, ఈ చట్టాన్ని తమతమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కేరళ, వెస్ట్ బెంగాల్‌తో పాటు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు