సహజీవనం చేస్తూ శృంగారంలో పాల్గొనడం రేప్ అవుతుందా?

మంగళవారం, 2 మార్చి 2021 (07:44 IST)
దేశ సుప్రీంకోర్టుకే ఓ సందేహం ఉత్పన్నమైంది. పూర్తి సమ్మతంతో సహజీవనం చేస్తూ శృంగారంలో పాల్గొనడం అత్యాచారం ఎలా అవుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ. బాబ్డే ప్రశ్నించారు. ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చామని గుర్తుచేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ... తనను పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి, సహజీవనం చేసి, ఆపై అత్యాచారం చేశాడని ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నిందితుడు, బాధితురాలు రెండేళ్లకు పైగా సహజీవనం చేశారు. 
 
అయితే ఆ మహిళ పెళ్లయ్యే వరకు శృంగారానికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మనాలిలోని ఓ ఆలయంలో నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. అయితే తాను పెళ్లి చేసుకోలేదని బాధితుడు న్యాయస్థానానికి తెలిపాడు. ఆమె సమ్మతితోనే సహజీవనం చేసినట్లు వెల్లడించాడు.
 
ఆలయంలో జరిగిన పెళ్లి నిజమైనదని నమ్మడం వల్లే ఆమె శృంగారానికి అంగీకరించిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆమెను మోసం చేశాడన్నారు. 
 
దీనిపై ప్రధాని న్యాయమూర్తి బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "పెళ్లి విషయంలో మోసపూరిత హామీ ఇవ్వడం తప్పు. ఎవరూ అలా చేయకూడదు. కానీ, సహజీవనం చేసి, శృంగారంలో పాల్గొనడాన్ని రేప్‌ అని ఎలా చెబుతారు?" అని వ్యాఖ్యానించింది. ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చామని గుర్తుచేసింది. 
 
అయితే నిందితుడు శారీరకంగా హింసించాడని, రహస్య భాగాల్లో గాయాలవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. ఆమె కాలు కూడా విరగ్గొట్టాడని చెప్పారు. స్పందించిన సీజేఐ.. "అప్పుడు మీరు దాడి, గృహ హింస కేసు పెట్టాలి. అత్యాచార కేసు ఎందుకు పెట్టారు?" అని ప్రశ్నించారు. వివాహ బంధంతో కలిసి జీవిస్తున్న సమయంలో జరిగిన దాడిని అత్యాచారంగా పరిగణిస్తారా? అని ప్రశ్నించారు. 
 
పైగా, ఈ కేసులో నిందితుడిని నాలుగు వారాల పాటు అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న నిందితుడి అభ్యర్థనను తిరస్కరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు