కోవిడ్-19: 60ఏళ్ళు దాటేశారా?... అయితే తస్మాత్ జాగ్రత్త

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (08:28 IST)
కోవిడ్-19 వైరస్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకనగా యువకులతో పోలిస్తే వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువ. అందుకే కోవిడ్ వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన సూచనలను పాటించాల్సిన అవసరం ఉంది.  
 
మరింత జాగ్రత్తగా ఉండడానికి సూచనలు:
* వృద్ధులలో రోగనిరోధక శక్తి మరియు శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది. అలాగే బహుళ అనుబంధ వ్యాధుల వల్ల కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వృద్ధులు ఇంట్లోనే ఉండాలి, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలి.
 
* ప్రభుత్వం నిబంధనలు సడలించిందని ఏమాత్రం కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, కూరగాయల మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా తిరగడం మానుకోండి.
 
* సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడుక్కోవాలి. దగ్గేటప్పుడు  తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవాటు చేసుకోవాలి.
 
* తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్లరసాలు తీసుకోవాలి.
 
* వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
 
* పార్కులు, మార్కెట్లు, మత సంబంధమైన ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు
 
* మరీ ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వయసు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు. 
 
వృద్ధుల మరణాల రేటు తగ్గించేందుకు మార్గదర్శకాలు
కరోనా పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఇదివరకే కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారి చేసింది. .  
 
60 సంవత్సరాలు పైబడిన వారికి వెంటనే ట్రూనాట్ టెస్ట్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే ఈ కింది ప్రొటోకాల్ పాటించాలి.
 
ట్రునాట్ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఊహాజనిత సానుకూల కేసులుగా పరిగణించబడతాయి. ఈ కేసులనన్నింటినీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పటల్ కు తరలించి ఎవరితోనూ కలిసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కేసులన్నింటికి మరుసటి రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. ఆ ప్రకారం కోవిడ్ చికిత్స కొనసాగించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు