రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6 వేల నగదు బహుమతి

శుక్రవారం, 9 జూన్ 2023 (12:30 IST)
Pradhan Mantri Matru Vandana Yojana
దేశంలో ఆడపిల్లల జనాభా నిష్పత్తిని పెంచేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మిషన్ శక్తి అనే కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద రెండో కాన్పులో అమ్మాయి పుడితే ఆరు వేల రూపాయల నగదును ఇవ్వనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.ఆరు వేలు ఆర్థిక సాయంగా అందజేయనుంది. 2022 ఏప్రిల్‌ నుంచే దీన్ని వర్తింపజేస్తారు. 
 
ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.5 వేలు చెల్లిస్తోంది. మహిళ గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2,000, ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యూనైజేషన్‌ సైకిల్‌ పూర్తయ్యాక రూ.2,000 చొప్పున అందజేస్తుంది. 
 
ఈ పథకంలో రెండో కాన్పునకు ఆర్థిక లబ్ధి వర్తించేది కాదు. దీన్ని సవరిస్తూ.. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6వేలు ఇచ్చేలా మార్పుచేశారు. రెండో ప్రసవంలో కవలలు జన్మించి, వారిలో ఒక అమ్మాయి ఉన్నా పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గర్భస్రావాలు తగ్గించడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటును ఇచ్చేందుకు మిషన్‌ శక్తిలో దీన్ని చేర్చినట్లు కేంద్రం చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు