తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గవర్నర్ పదవి?

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (13:57 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గవర్నర్‌గా నియమించనున్నారంటూ కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనిపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజినీకాంత్‌కు గవర్నర్ పదవి అనేది దేవుడి చేతిలో ఉందన్నారు. అదేసమయంలో రజినీకాంత్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రారని ఆయన స్పష్టం చేశారు. 
 
ఆదివారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం రజినీతో భేటీ కావడం వెనుక ఎలాంటి రాజకీయమూ లేదన్నారు. రజినీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో వుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తరభారత పర్యటనకు వెళ్లిన రజనీకాంత్... ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తదితరులతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గవర్నర్ పదవి రానుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం  
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నారు. చోరీలు, దోపిడీలు, అత్యాచారయత్నాలు, హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్ళవారి పంచాయతీ పరిధిలోని బాప్టిస్టు పాళెంలో ఓ వాలంటీర్ ఓ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి అరుగుపై కూర్చొనివున్న వివాహితను వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి బలవంతంగా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాప్టిస్టు పాళెంకు చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటిముందు అరుగుపై కూర్చున్నారు. ఆ సమయంలో వాలంటీరు గాలిమోటు లోకకుమార్ ఆమె వద్దకు వచ్చి 'నువ్వంటే నాకు ఇష్టం' అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే తేరుకుని, చేయి విడిపించుకుంటూ కేకలు వేశారు. ఎందుకు అరుస్తున్నావంటూ అతడు కాలితో తన్నడంతో ఆమె పడిపోయారు. చుట్టుపక్కల వారు రావడంతో 'నీ అంతు చూస్తా.. నన్ను ఎవ్వడూ ఏం చేయలేరు' అంటూ అక్కడ నుంచి జారుకున్నాడు. 
 
కాసేపటికి తన బంధువులు, అనుచరులతో కర్రలు తీసుకుని వచ్చాడు. వారి దాడి నుంచి తప్పించుకుని, బాధితురాలిని ఆమె బంధువులు ఆటోలో తీసుకుని చెరుకుపల్లి వచ్చారు. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు.
 
వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని తెలిపారు. వాలంటీరు లోకకుమార్ గ్రామంలో తనలాంటి వారి నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోగా, దిక్కున్నచోట చెప్పుకోవాలని దౌర్జన్యం చేస్తున్నాడని వార్డు సభ్యురాలు మరియమ్మ వాపోయారు. తాము వైకాపా వారిమేనని, వాలంటీరు అరాచకాలకు తట్టుకోలేకపోతున్నామని కొందరు మహిళలు పోలీసుల వద్ద విలపించారు. పింఛను ఇచ్చే నెపంతో వాలంటీరు ఇళ్లకు వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు