భర్తను భార్య చంపినా.. ఆమెకు పింఛను ఇవ్వాల్సిందే....

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (09:57 IST)
పంజాబ్, హర్యానా రాష్ట్ర హైకోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. భర్తను చంపినప్పటికీ.. భార్యకు పింఛను ఇవ్వాల్సిందేనంటూ ఆదేశించింది. ఎందుకంటే... ప్రభుత్వ ఉద్యోగి భార్యకు ఉన్న కుటుంబ పింఛను హక్కు కాదనలేనిది. ఒకవేళ ఆమె తన భర్తను చంపినా సరే.. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్నా సరే ఆమెకు పింఛను ఇవ్వాల్సిందేనంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు తాజాగా అసాధారణ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా 'బంగారుగుడ్లు పెట్టే కోడిని ఎవరూ కిరాతకంగా చంపుకోరు' అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
 
'కుటుంబ పింఛను అనేది సంక్షేమ పథకం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినపుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు దాన్ని ప్రవేశపెట్టారు. క్రిమినల్‌ కేసులో ఆమెకు జైలుశిక్ష పిడినప్పటికీ ఈ పథకం కింద భార్యకున్న హక్కును కాదనలేం' అంటూ హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్‌ కౌర్‌ అనే మహిళ దాఖలు చేసిన పిటిషను విచారణ సందర్భంగా జనవరి 25న హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
హర్యానా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె భర్త తర్సెమ్‌సింగ్‌ 2008లో చనిపోయారు. 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 2011లో కోర్టు శిక్ష విధించింది. అప్పటిదాకా బల్జీత్‌ కౌర్‌కు అందుతున్న కుటుంబ పిఛన్‌ను శిక్ష పడగానే హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెడుతూ బల్జీత్‌కౌర్‌కు రావాల్సిన కుటుంబ పింఛను, పాత బకాయిలు రెండు నెలల్లో విడుదల చేయాల్సిందిగా హైకోర్టు సంబంధిత శాఖను ఆదేశించింది. భర్త మరణానంతరం కుటుంబ పింఛను హక్కుదారు భార్యేనంటూ 1972 సీసీఎస్‌ (పింఛను) నిబంధనల మేరకు హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు