వ్యాక్సిన్ వేయించుకున్నా.. కరోనా వైరస్ సోకింది... ఎక్కడ?

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:06 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు కరోనా టీకాలను అభివృద్ధి చేయగా, వీటిని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అలాగే, మన దేశంలో కూడా ఈ టీకాలను వేశారు. అయితే, ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురికి ఈ వైరస్ సోకింది. ఈ ఐదుగురు కూడా వైద్యులే కావడం గమనార్హం. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో జరిగింది. 
 
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చామరాజనగర్ జిల్లాలో కరోనా టీకాను తీసుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వీరికి తొలి డోస్‌ను తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
 
కాగా, తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్‌ టీకా వేయించుకోవాల్సి వుంది. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయని, అప్పుడే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
టీకా తొలి డోస్ తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు