గవర్నర్‌గా కిరణ్ బేడీ తొలగింపు.. ఆమె స్థానంలో తమిళిసై.. పుదుచ్చేరి రాజకీయాల్లో..?

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (22:43 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది.

ప్రతిపక్షం ఒక సభ్యుడిని తమ వైపునకు లాగేసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. అయితే ఈ సమయంలో ఇప్పటిదాకా గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని తొలగించారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌కు పుదుచ్చేరి అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
తదుపరి ఏర్పాట్లు జరిగేంతవరకు పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్‌తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తెపైంతన్‌ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధన వేలు మీద అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్‌ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది.
 
ప్రతిపక్షాల బలం 14 (ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలంతో సమంగా బీజేపీ కూడా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని గనుక ప్రతిపక్షాలు లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 
 
పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. అలానే తమ ప్రభుత్వాన్కి ఏమీ ధోకా లేదని ఆయన చెబుతున్నారు. కానీ తాజా పరిణామంతో ఆపరేషన్ లోటస్ ప్రారంభించినట్టేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు