లోక్‌సభ ఎన్నికలు 2024 : ప్రశాంతంగా సాగుతున్న మూడో దశ పోలింగ్

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (09:23 IST)
లోక్‌సభ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలై ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల్లోపది రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 ‌లోక్‌సభ స్థానాలకు మంగళారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అలాగే, ఓట్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. 
 
2019 లోకసభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్‌లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది. మూడో దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్ గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ - 10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. 
 
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ లోకసభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.
 
కాగా, మూడో దశ పోలింగ్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వీరు ఓటు వేయనున్నారు. గాంధీనగర్ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌‍లో ప్రధాని మోడీ ఓటు వేయనున్నారు. ఇక ఇదే నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఓటు వేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు