ఓటు వేస్తే డైమండ్ రింగ్... వజ్రపు ఉంగరాలను గెలుచుకున్న ఓటర్లు ... ఎక్కడ?

ఠాగూర్

బుధవారం, 8 మే 2024 (16:49 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ జిల్లాలో ఎన్నికలక అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటర్లకు లక్కీ డ్రా నిర్వహించి ఖరీదైన బహుమతులు అందజేశారు. మంగళవారం జరిగిన పోలింగ్‌లో నలుగురు ఓటర్లు ఏకంగా వజ్రాల ఉంగరాలు గెలుచుకోవడం విశేషం.
 
మూడో విడత ఎన్నికల్లో భాగంగా భోపాల్‌ లోక్‌సభ స్థానానికి మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి లక్కీ డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారులు ముందుగానే ప్రకటించారు. ఓటర్లు వేలికి సిరా గుర్తు చూపించి తమ పేరు, ఫోన్‌ నంబరు వంటి వివరాలను టోకెన్‌పై రాసి లాటరీ బాక్సులో వేయాలని సూచించారు.
 
ఇందుకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. అనేకమంది ఓటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోలింగ్‌ రోజున ఉదయం 10, మధ్యాహ్నం 2, సాయంత్రం 6 గంటలకు మూడుసార్లు డ్రా తీశారు. పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు చొప్పున విజేతలుగా ప్రకటించారు. వీరిలో మళ్లీ మెగా డ్రా నిర్వహించి నలుగురు ఓటర్లకు వజ్రపు ఉంగరాలు అందజేశారు.
 
మిగిలిన ఓటర్లకు మిక్సర్లు, వాటర్‌ కూలర్లు వంటి బహుమతులు ఇచ్చారు. కన్సోలేషన్‌ కింద కొందరికి టోపీలు, వాటర్‌ బాటిళ్లు, టీషర్ట్‌ కానుకలిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమం కింద ప్రైవేటు సంస్థలు ఇచ్చిన విరాళాలతో ఈ లక్కీ డ్రా బహుమతులను అందజేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు