రూ.2.5 కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేస్తాం .. ఆర్మీ జవాన్ బేరసారాలు!!

ఠాగూర్

బుధవారం, 8 మే 2024 (14:11 IST)
తమకు రూ.2.5 కోట్ల నగదు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేస్తామని ఓ రాజకీయ నాయకుడితో ఆర్మీ జవాన్ బేరసారాలు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మారుతి ధక్నే అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు. మారుతి ఇటీవల శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ ధన్వే‌ను కలిశాడు. ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తామని, అందుకు రూ.2.50 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పాడు. 
 
దీంతో అనుమానించిన అంబాదాస్ పోలీసులకు సమాచారం అందించారు. పైగా, ఆ సైనికుడు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో పట్టించేందుకు ప్లాన్ చేశాడు. మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర, నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ రూ.1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమ్మించి అడ్వాన్స్ కింద లక్ష రూపాయలు ముట్టజెప్పాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. 
 
నిందితుడు మారుతికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయని, వాటిని ఇలా అడ్డదారుల్లో తీర్చాలని భావించాడని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. అహ్మద్ నగర్ జిల్లాకు చెదిన మారుతి ధక్నే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్‌ ప్రాంతంలని ఆర్మీ బేస్‌లో పని చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు