ఢిల్లీ సర్కారు కొరఢా... ముఖానికి మాస్క్ ధరించకుంటే రూ.2 వేలు ఫైన్

గురువారం, 19 నవంబరు 2020 (16:25 IST)
దేశం రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఢిల్లీ సర్కారు కొరఢా ఝుళిపించనుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖ కవచం (ఫేస్ మాస్క్) ధరించని వారికి రూ.2 వేల వరకు అపరాధం విధించనున్నారు. 
 
అలాగే, మాస్కులు ధరించకుండా, రోడ్లపై బాధ్యతా రాహిత్యంగా తిరుగుతున్న వారిపై కన్నెర్ర చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటివరకు రూ.500గా ఉన్న జరిమానాను రూ.2 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు.
 
కరోనా మహమ్మారిపై గురువారం కేజ్రీవాల్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నేపథ్యంలో అదనంగా ఐసీయూ బెడ్లు, ఇతర వసతులు కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెపుతున్నామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను పంపిణీ చేయాలని అన్ని రాజకీయ పార్టీలను, సామాజిక సంస్థలను కోరారు.
 
ఢిల్లీ వాసులను బెంబేలెత్తిస్తున్న కరోనా 
 
ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. దీంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 131 మంది మృతి చెందారు. ఒక్క రోజులో కరోనా కారణంగా మృతి చెందినవారిలో ఇదే అత్యధికం. ఇక గడచిన 24 గంటల్లో కొత్తగా 7,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది. 
 
అలాగే, ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 7,943కు చేరింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 62,232 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలో 42,458 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,03,084కు చేరింది. ఢిల్లీలో కరోనా కట్టటికి ఇంటింటి సర్వేను చేపట్టారు. 
 
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే రెండు రోజుల పాటు వెయ్యి లోపు నమోదవగా.. బుధవారం మాత్రం కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,058 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,60,834కు చేరుకుంది. 
 
అదేసమయంలో కరోనా కారణంగా తెలంగాణలో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,419 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 12,682 యాక్టివ్ కేసులున్నాయి. 2,46,733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు