తమిళనాడులో కోవిడ్ సోకితే చికిత్స గగనమే..? రోజుకు రూ.25,353..?

గురువారం, 4 జూన్ 2020 (15:23 IST)
తమిళనాడులో కోవిడ్ సోకినే చికిత్స పొందడం సామాన్య ప్రజలకు గగనమయ్యేలా వుంది. తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు రోజుకు రూ.23 వేలు వసూలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు తమిళనాడు ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ప్రతిపాదించింది. కోవిడ్-19 తొలి దశలో ఉన్న రోగులకు 10 రోజులు చికిత్స చేస్తే రూ.2.31 లక్షలు వసూలు చేయాలని సూచించింది. 
 
అంతేగాకుండా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న రోగులకు 17 రోజుల చికిత్సకు గానూ రూ.4.31 లక్షలు ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. అంటే.. కరోనా లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్న రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాలంటే రోజుకు రూ.25,353 చెల్లించాల్సి వుంటుంది. 
 
ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్-19 చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విషయం తమిళనాడు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో.. కోవిడ్-19 చికిత్సకు ఒక నిర్ధిష్ట ఛార్జీలను ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం నేపథ్యంలోనే తాజాగా ఐఎంఏ ఈ ప్రతిపాదనలను ప్రకటించింది.
 
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొద్దిరోజులుగా రోజుకి వెయ్యి కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,286 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 25,872కు చేరింది. బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై త‌మిళ‌నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. బుధవారం మొత్తం 1286 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 1244 మంది స్థానికులు కాగా.. 42 మంది విదేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వార‌ని తెలిపింది. 
 
త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో ఒక్క చెన్నై సిటీలోనే భారీగా 17,598 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే రాష్ట్రంలో ఎక్కువ‌గా మ‌గ‌వాళ్లే క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని ఆరోగ్య శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు