అతీతశక్తులను సొంతం చేసుకోవాలనీ... కన్నబిడ్డలను బలిచ్చేందుకు ప్లాన్.. ఎక్కడ?

బుధవారం, 14 ఏప్రియల్ 2021 (09:49 IST)
అతీతశక్తులను సొంతం చేసుకోవాలని సొంత బిడ్డలనే బిలిచ్చేందుకు ఓ కన్నతండ్రి ప్లాన్ వేశాడు. తండ్రి ప్లాన్ పసిగట్టిన బిడ్డలు అతని చెర నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. 
 
గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢ విశ్వాసంతో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు హతమార్చిన విషయం తెల్సిందే. తాజాగా తమిళనాడులోనూ దాదాపు అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. అయితే, ఇక్కడ చిన్నారులు ఇద్దరూ చాకచక్యంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యంలోని స్థానిక రైల్‌నగర్‌కు చెందిన రామలింగం (42), రంజిత (32) భార్యాభర్తలు. వీరికి దీపక్ (15), కిషాంత్(6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
చీరల వ్యాపారం చేసే రామలింగం ఇందుమతిని రెండో వివాహం చేసుకుని అదే ప్రాంతంలోని వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలైన ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తుండేది. 
 
ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి స్నేహాన్ని గమనించిన రామలింగం మీరిద్దరూ శివపార్వతుల్లా ఉన్నారని చెప్పాడు. దీంతో వారిలో కొత్త ఆలోచనలు చెలరేగాయి. ఇటీవల తామిద్దం పెళ్లి చేసుకుంటామని ధనలక్ష్మి, రంజిత చెప్పడంతో రామలింగం అందుకు అంగీకరించాడు.
 
అంతేకాదు, కుమారుల ఎదుట ఇంట్లోనే వారిద్దరికీ వివాహం చేశాడు. వారి పెళ్లి తర్వాత పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. స్కూలుకు పంపకుండా వారితో ఇంటి పనులు చేయించడం మొదలుపెట్టారు. 
 
అతీతశక్తులు వస్తాయన్న నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేసేవారు. అక్కడితో ఆగక శరీరానికి కారం పూసి ఎండలో పడుకోబెట్టేవారు. వారితో శానిటైజర్ తాగించేవారు.
 
చివరికి వారిని బలి ఇవ్వడం ద్వారా అతీత శక్తులను సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. వారి మాటల ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారులు ఇంటి నుంచి పారిపోయి తాతయ్య ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత, ధనలక్ష్మి, రామలింగాన్ని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు