ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల కమిషనర్ల నియామకం.. కేంద్రం చర్యలు

ఠాగూర్

సోమవారం, 11 మార్చి 2024 (11:49 IST)
భారత ఎన్నికల సంఘంలోని రెండు కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోపు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ అత్యవసరంగా భేటీకానుంది. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తో సహా ఇద్దరు కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఉండేవారు. వీరిలో అనూప్ చంద్ర పదవీ విరమణ చేయగా, అరుణ్ గోయల్ ఆకస్మిక తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 
 
మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడనుండగా ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా సంచలనంగా మారింది. శుక్రవారం ఆయన రాజీనామా చేయగా శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోయెల్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం, న్యాయమంత్రిత్వ శాఖ ఈ విషయమై ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గోయల్ రాజీనామాతో ఎన్నికల కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.
 
ఈ నేపథ్యంలో నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఇందులో హోం శాఖ సెక్రెటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగం సెక్రెటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తొలుత కమిషనర్ల పోస్టులకు ఐదుగురు అభ్యర్థులు ఉన్న రెండు జాబితాలను సిద్ధం చేస్తుంది.
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ ఈ రెండు జాబితాల్లో నుంచి ఇద్దరిని కమిషనర్లుగా ఎంపిక చేస్తుంది. అనంతరం, రాష్ట్రపతి కమిషనర్ల నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. మార్చి 13 లేదా 14న సెలక్షన్ కమిటీ భేటీ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ మరుసటి రోజే కొత్త కమిషనర్లు నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం.
 
రాజ్యాంగంలోని 324 అధీకరణ ప్రకారం ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటూ ఎన్నికల కమిషనర్లు కూడా ఉండాలి. వీరి సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కాగా, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టం అమలుకు ముందు సీనియర్ ఈసీ అధికారిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేవారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు