పదవీకాలం ముగియగానే ఆ గవర్నరు పరిస్థితి ఏంటో?

సోమవారం, 2 సెప్టెంబరు 2019 (13:03 IST)
కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నరుగా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనపై బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఎదుర్కోవాల్సి ఉంది.

రాజస్థాన్ ప్రస్థుత గవర్నరు కల్యాణ్ సింగ్ స్థానంలో కొత్త గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి కల్ రాజ్ మిశ్రాను రాష్ట్రపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేసినపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారనే కేసులో బీజేపీ నాయకులు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలతోపాటు కల్యాణ్ సింగ్ లపై ఉన్న ఆరోపణలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్ 19వతేదీన ఆదేశాలు జారీ చేసింది.

ఆ సమయంలో కల్యాణ్ సింగ్ రాజస్థాన్ రాష్ట్ర గవర్నరుగా రాజ్యాంగ పదవిలో ఉండటంతో ఆ కేసులో అతన్ని సుప్రీం పిలవలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్లు తమ పదవీ కాలంలో క్రిమినల్, సివిల్ కేసుల నుంచి మినహాయింపు పొందవచ్చు.

గవర్నరుగా కల్యాణ్ సింగ్ పదవీ కాలం ముగియడంతో ఆయనకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసే అవకాశముంది. యూపీ సీఎంగా కల్యాణ్ సింగ్ తాను వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసేందుకు అనుమతించనని జాతీయ కౌన్సిల్ ముందు హామి ఇచ్చి సింబాలిక్ కరసేవకు అనుమతించారని ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు